గుర్రంపోడు మండలంలో చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు పోలీసులకు గాయాలు

గుర్రంపోడు మండలంలో చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు పోలీసులకు గాయాలు
  •     నల్గొండ ఆసుపత్రిలో పరామర్శించిన ఎస్పీ 

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలో గుర్రంపోడు మండల పరిధిలో పోలీసు వాహనం ప్రమాదానికి గురికాగా నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సోమవారం మక్తల్ లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు నల్గొండ జిల్లా నుంచి పోలీసులు బందోబస్తుకు వెళ్లారు. అక్కడ డ్యూటీ ముగిసిన అనంతరం తిరిగి నల్గొండకు కారులో బయలుదేరారు. 

.మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జువ్వి గూడెం స్టేజీ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి చెట్టును డీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు ఏఎస్ఐలు శ్రీధర్​, నరసింహరెడ్డి, సత్యనారాయణ,హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం పోలీసులు హుటిహుటిన నల్గొండ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. 

ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న సిబ్బందిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని ఎస్పీ వైద్య సిబ్బందిని ఆయన కోరారు.